ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైసీపీలో చేరుతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.మారేష్ వైసీపీలో చేరారు. ఆదివారం సాయంత్రం మండలంలోని ఐదవరం గ్రామంలోని మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ నివాసంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్ట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండి తోక జగన్మోహన్రావు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, సామినేని ఉదయ భాను, డాక్టర్ మొండితోక అరుణకుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
