కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. టీడీపీ పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి నేతల అంతరంగం ఒక్కటేనన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతూ లోప భూయిష్టమైన రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆ నేతలకు ప్రత్యక్షంగా హితవు పలికారు. ఇన్నాళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు ఓటమిపాలు అయ్యారు. అంతేకాదు గత ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జిల్లాలో సీనియర్ బీసీ నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఓ వైపు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా శ్యాంబాబు గెలుపు కోసం వ్యూహాలు రచించారు. అయితే ముఠా తగాదాలను జీర్ణించుకోలేని పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కేఈ శ్యాంబాబును ఓటమి పాలు చేశారు. ఓకే ఎన్నికల్లో కోట్ల, కేఈ కుటుంబాలను దారుణంగా దెబ్బ కొట్టాడు వైఎస్ జగన్ .
