అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు. కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి పనులను నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. 23 బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. దివాకర్ ట్రావెల్స్పై అనేక ఫిర్యాదులు వచ్చాయని,అందులో భాగంగానే తనిఖీలు చేశామని, విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు.
