ప్రస్తుత కాలంలో ప్రతి ఏటా గుండెజబ్బుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. మారిన జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రధానంగా గుండెకు సరఫరా అయ్యే ధమనులు బ్లాక్ అవడం వల్ల హార్ట్ ఎటాక్లకు దారి తీసి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే ఈ తాజాగా బ్రిటన్లోని షెఫీల్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుండెపోటు వచ్చిన వారి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయగల ఔషధాన్ని అభివృద్ధిచేశారు. దానికి ‘సెలాటోగ్రెల్’ అని పేరుపెట్టారు. ఈ మందును ఇంజక్షన్ ద్వారా హార్ట్ పేషెంట్లకు అందించి పరిశీలించారు. ఈ మందు శరీరంలోకి ప్రవేశించిన 15 నిమిషాల్లోనే ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించి, రోగికి ఉపశమనం కలిగించిందని అధ్యయనంలో గుర్తించారు. దాని ప్రభావం దాదాపు 8 గంటలపాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గుండెపోటు వచ్చిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే..ఈ ఔషధం వారి ప్రాణాలు నిలబెట్టడంలో ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. మొత్తంగా గుండెపోటు వచ్చిన తొలిదశలో ఈ మందు బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా ఈ సెలాటోగ్రెల్ మందు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
