అమరావతిలో రైతులెవరూ ఆవేశాలకు లోను కావద్దని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. తాజాగా మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇస్తూ చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏవర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు.. కాబట్టి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. వెలగపూడి నుంచి కొందరు మహిళలు తనను కలిశారని, తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దని.. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీతో చర్చలు జరిపేందుకు వచ్చినప్పుడు మీరు ముందుకు రావాలని, తొందరపడి ఒక మాట అంటే వెనక్కి తీసుకోవడం కష్టం కాబట్టి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అన్నారు.
