ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీకి బదులు 18న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ముందుగా ఈ నెల 17న సీఎం కర్నూలు పర్యటన ఖరారైంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో ‘స్పందన’ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని, 18వ తేదీన ఖరారు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో స్వయంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా అధికారులకు సూచించారు. దీంతో జిల్లా అధికారులు 18వ తేదీన సీఎం జిల్లా పర్యటనను ఖరారు చేశారు. ఆ రోజు కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏఎన్ఎం సబ్ సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
