ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇదివరకే లోకేష్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నదీ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మాత్రం తాను పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసి…తనకు, తన మామ బాలకృష్ణకు మధ్య గొడవలు పెట్టకండని మీడియాకు సలహా కూడా ఇచ్చారు. దీంతో నారా లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి నారా లోకేశ్ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు.
