ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అయితే ఒక సీనియర్ నేత మరణించిన బాధ బాబులో ఏ కోశానా లేదు..కోడెల పోయారన్న బాధ కంటే…ఆయన ఆత్మహత్యను ఎంతగా రాజకీయంగా ఉపయోగించుకుందామనే తాపత్రయమే ఈ మూడు రోజులపాటు చంద్రబాబు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ విషాద సందర్భంలో వైసీపీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తే.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వమే హత్య చేసిందంటూ మూడు రోజులు శవరాజకీయం చేశాడు. అయినా సీఎం జగన్ పెద్దమనసుతో ఆ పెద్దాయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనలాలతో జరిపించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశాడు. ఇక్కడా చంద్రబాబు తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయం చేశాడు. ఒక సీనియర్ నేత అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించేదిపోయి..పోలీసులకు, అధికారులకు సహకరించకుండా..టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పాడు.
ఇక కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, ఆయన బామ్మర్ది బాలయ్య ప్రవర్తన చూసి, కోడెల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నర్సరావుపేట ప్రజలు విస్తుపోయారు. నరసరావుపేట అంతటా విషాదం అలుముకున్న తరుణంలో బాబు, బాలయ్యలు మాత్రం నవ్వులు చిందిస్తూ..ప్రజలకు అభివాదాలు చేస్తూ..కార్యకర్తలకు విక్టరీ సింబల్ను చూపిస్తూ..కోడెల అంతిమయాత్రను సాగించారు. చంద్రబాబు, బాలయ్య తీరు చూసి ఇది కోడెల అంతిమయాత్రనా..టీడీపీ విజయ యాత్రనా అని అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, నరసరావుపేట ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు. విషణ్ణ వదనంతో, బాధాతప్త హృదయంతో కనిపించాల్సిన చంద్రబాబు, బాలయ్యలు కోడెల, బాలయ్యలు ఎందుకలా ఆనందంగా, ఉత్సాహంగా ప్రవర్తించారనే దానిపై తెలుగుతమ్ముళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కోడెల ఆత్మహత్య నేపథ్యంలో చంద్రబాబు చేయాల్సినంత రచ్చ చేయించాడు. ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించడం వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనను..టీడీపీ నేతలతో, ఎల్లోమీడియాతో ప్రచారం చేయించాడు. దీంతో ప్రభుత్వం కూడా ఒకరకంగా డిఫెన్స్లో పడిపోయింది. నిజానికి కోడెల సూసైడ్ వెనుక ప్రభుత్వ పాత్ర లేకపోయినా…బాబు శవరాజకీయంలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా పల్నాడులో భారీ విధ్వంసం చేయించేందుకు బాబు రంగం సిద్ధం చేశాడు. చంద్రబాబు కుయుక్తులను గమనించిన ప్రభుత్వం సంయమనం పాటించి..ఎక్కడా విధ్వంసం చెలరేగకుండా జాగ్రత్తపడింది. అయితే కోడెల ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడంలో బాబు కొద్ది మేర సక్సెస్ అయ్యాడు. అంతే కాదు కోడెల ఆత్మహత్యతో చెలరేగిన వివాదంతో ప్రభుత్వం టీడీపీ నేతలపై ఉన్న కేసులపై విచారణకు వెనకడుగు వేస్తుందని, తద్వారా తన జోలికి రాదని బాబు భావించాడు. ముఖ్యంగా పల్నాడులో వరుసగా సాగించిన పునరావాస కేంద్రాల డ్రామాలు, శవరాజకీయం డ్రామాలు ఫలించాయనే ఆనందం అంతిమయాత్ర సందర్భంగా చంద్రబాబు ముఖంలో కనిపించింది. అందుకే విజయవంతంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసామనే ఆనందంతో అంతిమ యాత్ర ఆసాంతం విక్టరీ సింబల్స్, అభివాదాలు చేస్తూ బాబూ, బాలయ్యలు హల్చల్ చేశారు. మొత్తంగా విషాదంగా సాగాల్సిన కోడెల అంతిమయాత్ర, టీడీపీ విజయోత్సవ యాత్రగా సాగిపోవడం చంద్రబాబు శవరాజకీయాలకు పరాకాష్ట అనే చెప్పాలి. చావులో కూడా పండుగ చేసుకుంటున్న ఈ బావ, బామ్మర్దులను చూసి నరసరావుపూట ప్రజలు అసహ్యించుకుంటున్నారు.