ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు.. చంద్రబాబు డైరెక్షన్లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. అసలు బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమపార్టీ నాయకులకు గౌరవం ఉందని కానీ కన్నావంటి వ్యక్తులవల్ల ఆ గౌరవం పోతోందన్నారు. కన్నా కు గుంటూరులో రౌడీ ముద్ర ఉందని, సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, రాష్ట్ర ఖజానాను ఖాళీచేసి అప్పుల ఊబిని జగన్ కు ఇవ్వడం జరిగిందన్నారు. దానిని సవాల్గా స్వీకరించి ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధివైపునకు తీసుకువెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏప్రాంతంలో ఏ పరిశ్రమ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు తెలిపారు. చంద్రబాబులా నీచ రాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణం అన్నారు. చంద్రబాబు, కన్నావల్ల ప్రజలకు ఏమి ఒరగిందని, ఎవరెన్ని డ్రామాలాడినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీఎస్టీలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.