విశాఖ నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు ముగించుకుని ఆస్పత్రికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్ వెతుక్కోవాలని తన గదిలోకి వెళ్లింది.
కాగా, దీప ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి భర్త ప్రవీణ్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి సోదరుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.