సంక్రాంతి హంగామా మొదలైపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండదు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్లలో బెట్టింగ్ జరిగే కోడి పందేలకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని హోంమంత్రి చెప్పారు. చట్టాలను గౌరవిస్తూ అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని ఆయన అన్నారు. మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈ రోజు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు చినరాజప్ప. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు.
