అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం ఇప్పించడానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అంతేగాక వైసీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్ దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని ఉరవకొండ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
