కర్నూల్ జిల్లాలో టీడీపీ ,కాంగ్రెస్ నుండి జోరుగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి.తాజాగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైఎస్. జగన్ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం ఎంపీపీ నసురుద్దీన్, తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి సమక్షంలో వీరంతా వైసీపీలో లాంఛనంగా చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ పోరాటాలను గుర్తించి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఆ పార్టీల విధానాలు, వైఖరులు నచ్చకే వీరంతా పార్టీలో చేరారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల మందిని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల నుంచి మాటతప్పకుండా ఒకే మాటమీద నిలబడి నికరంగా పోరాటం చేస్తోంది వైసీపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, పాదయాత్రల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా వేలాది మంది ఆయనను అనుసరించడమే అందుకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కంటే మంచి పాలన అందించి చరిత్ర సృష్టిస్తారని స్పష్టం చేశారు.
