తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రుణాల ఎగవేత కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్నకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేరకు మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై కేంద్రంగా నడిచిన ఈ కంపెనీలో కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావు సహా ఐదుగురు మేనేజింగ్ డైరెక్టర్ల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) చెన్నైలోని ఆంధ్రా బ్యాంకుతోపాటు సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 2010 నుంచి 2013 మధ్య రూ. 364 కోట్ల రుణం తీసుకుంది. వాటిలో ఆంధ్రా బ్యాం కు నుంచి పొందిన రూ. 71 కోట్లను బీసీఈపీఎల్ కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు నకిలీ ఎంట్రీలు సృష్టించి తద్వారా ఆ సొమ్మును కుట్రపూరితంగా డొల్ల కంపెనీల్లోకి బదిలీ చేసుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆంధ్రా బ్యాంకు చేసిన ఫిర్యాదుతో నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంబించింది. ఇక నేరం రుజువైతే సుజనా చౌదరి జైళ్లో ఉండాల్సందేనా అంటున్నారు కొందరు నేతలు.
