ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ సమీక్షలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి తదితరులు హాజరయ్యారు.
