నిజానికి మొదట్లో రాజ్యసభ సభ్యుడుగా పంపడానికి తెరపైకి రకరకాల పేర్లు బయటకి వచ్చాయి కానీ… అనుహ్యంగా ఆ సమయంలో వేణుంబాకం విజయసాయిరెడ్డి అనే కొత్తపేరు తెరమీదికి వచ్చింది. అప్పటివరకు ఆయన ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఒక్క ఛార్టర్డ్ అకౌంటంట్ గానే తెలుసు, రాజకీయాలు పెద్దగా తెలియదు. ఆ సమయంలో వైసిపి అధికారంలో లేదు. జగన్ అనేక కేసుల్లో ఇరికించబడ్డాడు. అలాంటి క్లిష్ట సమయంలో విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపిస్తే రాజకీయాలు తెలియని ఆయన వలన వైసిపికి ఏమి ప్రయోజనం ఉంటుందో అని కొంత మంది అనుకున్నారు.
కానీ విజయ్ సాయి రెడ్డి విజృభించాడు. పంచకళ్యాణిని కట్టేసి ఉంచితే దాని శక్తి ఏమిటో ఎలా తెలుస్తుంది? కదనరంగంలోకి వదిల్తే వీరవిహారం చేసి అశ్వికుడికి విజయాలు సాధించి పెడుతుంది. సరిగ్గా విజయసాయిరెడ్డి కూడా ఆ పంచకళ్యాణిని తలపించారు ఢిల్లీలో. కేంద్రంలోని పెద్దలు అందరిని తన వాక్పటిమతో, చాతుర్యంతో, కలివిడితనంతో, మేధస్సుతో ఆకట్టుకున్నారు. సాటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి సైతం ఆయనకు ఎంతో విలువ ఇచ్చే స్థాయికి ఎదిగి వైసిపికి ఒక తరగని సంపదలా భాసిల్లారు.
ఇప్పుడీ ముచ్చట ఎందుకు చెప్పుకోవాల్సివచ్చిందంటే, వైసిపి అధికారంలోకి రావడానికి జగన్ కార్యదక్షత, మొండితనం, పట్టుదలతో పాటు జగన్ కు విజయసాయిరెడ్డి వ్యూహాత్మక సలహాలు కూడా ఎంతో కలిసొచ్చాయి. అగ్నికి వాయువు తోడైనట్లు ఇద్దరూ కలిసి వైసిపికి చిరస్మరణీయమైన విజయాన్ని చేకూర్చి పెట్టారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక ఇక రాజకీయాల జోలికి వెళ్లకుండా, పాలనలో పూర్తిగా నిమగ్నమై పోయారు జగన్. వారానికో పథకాన్ని ప్రారంభిస్తూ అవినీతికి ఆమడ దూరంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదని, రాజకీయంగా కూడా శత్రువులను నిర్వీర్యం చేస్తేనే పార్టీకి పదికాలాల పాటు మనుగడ సాధ్యం అని పార్టీ అధినాయకత్వం గుర్తించడంతో విజయసాయిరెడ్డి జూలు విదిల్చారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల మీద దృష్టి పెట్టిన విజయసాయి రెడ్డి తెలుగుదేశం మళ్ళీ లేవకుండా, బీజేపీ బలపడకుండా ఉండాలనే అంశం మీద దృష్టి సారించారని సమాచారం. ఆ వ్యూహానికి అనుగుణంగానే ఇతర పార్టీలనుంచి వలసలను ఆహ్వానిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇతర పార్టీలనుంచి నాయకులను తెచ్చుకున్నంత మాత్రాన వారికీ పెద్దపీట వెయ్యడం జరగదని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారు.