ఏపీలో టీడీపీ నేతలు వరుసగా పోలీస్ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే చింతమనేని అరెస్ట్ అయి జైల్లో ఉండగా, సోమిరెడ్డి, కూనరవికుమార్, కోడెల శివరామ్, యరపతినేని వంటి టీడీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లనున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న ఓ మద్యంపరిశ్రమకు ధాన్యం కొనుగోలు చేసి, దాదాపు 12 కోట్లు ఎగ్గొట్టాడంటూ ఆయన వ్యాపార భాగస్వామి హైదరాబాద్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిక్కారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో తెలంగాణ పోలీసులు వచ్చి టీడీపీ ఇన్చార్జిని అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. కాగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. భార్గవరామ్ విదేశాలకు పారిపోయాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదని భూమా అఖిల ప్రియ చెప్పుకొచ్చింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మరో టీడీపీ నేత అరెస్ట్ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇలా టీడీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతుండడం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోంది.
