వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, గత టిడిపి పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు,అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో భాగంగా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులపై దృష్టి సారించిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చనుమోలు వెంకట రావు ఫ్లైఓవర్ ప్రాంతం వరకు మరియు పలు ప్రాంతాల్లో బి.టి ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణ పనులను, నియోజవర్గంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. నైజాం గేట్ చర్చి రోడ్డు, గాంధీ హిల్ చుట్టుపక్కల ఉన్న డ్రైన్ లను కూడా త్వరలో నిర్మాణ పనులు చేపడతామన్నారు..అదేవిధంగా నియోజవర్గంలో కొండ ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, నూతన అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. విజయవాడ నగర అభివృద్ధి కి జగన్ కట్టుబడి ఉన్నారని, తాము చిత్తశుద్ధితో పని చేస్తామని ఆయన అన్నారు.
