తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినం సందర్భంగా వైజాగ్ , చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా మూడు రుద్రాక్ష మొక్కలను నాటారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంపై శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ సమాజంలో ఎన్నో పక్షులు, మరెన్నో జీవరాశులు అంతరించిపోవడానికి ముఖ్య కారణం వాయు కాలుష్యం, వాతావరణ సమతుల్యత లేకపోవడం. వాటి ద్వారా రాబోయే కాలానికి ఎంతో ఉపద్రవం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి మంచి కార్యక్రమాన్నికొనసాగించాలన్న సదుద్దేశంతో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి, వైజాగ్ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్కు, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ హరిచందనకు, ప్రముఖ వ్యాపారవేత్త, క్రీమ్స్టోన్ అధినేత విరేన్ షాకు శ్రీ స్వాత్మానందేంద్ర గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాజాగా స్వాత్మానందేంద్ర విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను ఐఏయస్ అధికారిణి హరిచందన స్వీకరించారు. ఈమేరకు ఈ రోజు ఉదయం స్వయంగా మొక్కలు నాటిన హరిచందన మరో ఐజీవిమెన్ సేఫ్టీ, అడిషనల్ సీపీ క్రైమ్స్, హైదరాబాద్, అమలాఅక్కినేనిని గ్రీన్ఛాలెంజ్కు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి గ్రీన్ఛాలెంజ్ను స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటినట్లు హరిచందన తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా హరిచందన ట్వీట్ చేశారు.
