తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ పార్టీ నేతల తీరు అధినేత చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది. ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్న ఒక్కొక్కరు పక్క చూపులు చూడటంతో చంద్రబాబుకి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. రాజకీయంగా బలపడతామని ఆయన ఒక పక్కన జిల్లాల పర్యటనల్లో చెప్తున్నా ఒక్క నేత కూడా నమ్మడం లేదనే అభిప్రాయం వినపడుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటికే పార్టీ మారిపోయారు. ఇక తాజాగా మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత టీడీపీలో యాక్టివ్గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ ఈసారి వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్య చేతిలో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ధూళిపాళ తాజాగా నారాలోకేష్ పర్యటనకు కూడా డుమ్మా కొట్టారు.
ఇటీవల లోకేష్ పొన్నూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని పరామార్శించేందుకు వెళ్లారు. అయితే అయ్యప్పమాల ధరించిన ధూలిపాళ మరణించిన వారి కుటుంబానికి వెళ్లడం సరికాదనే ఉద్దేశంతోనే లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాని లోకేష్ పర్యటన సందర్భంగా ఎక్కడా ధూలిపాళ ప్రస్తావన కనిపించలేదు. ధూళిపాళ్ల నరేంద్ర లోకేష్ను ఎంత మాత్రం పట్టించుకోకపోవడానికి అసలు కారణం ఏంటి ? అనేది అర్ధం కాలేదు. ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీ నారాయణతో ధూళిపాళ్ల నరేంద్రకు మంచి సంబంధాలు ఉన్నాయని త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. అటు వైసీపీ నుంచి కూడా ఆయనకు పిలుపు వచ్చినా అందుకు ధూళిపాళ్ల నరేంద్ర స్పందించలేదని, బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది