ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పారని, అయితే అప్పట్లో అలా చేయడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితులకు దారి తీసిందన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని, ఆయన 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఈ ప్రాంతానికి చేసింది శూన్యమన్నారు.
రాయలసీమకు రాజధాని కాకపోయినా కనీసం హైకోర్టు ఇవ్వాలని చంద్రబాబును ఎన్నో సార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. అసలు రాయలసీమకు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో నెరవేర్చింది ఒక్కటీ లేదన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేస్తున్నారని, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని, జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకూలమో… వ్యతిరేకమో చెప్పాలని శిల్పా డిమాండ్ చేశారు. రాజధానిలో చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూములకు రేట్లు తగ్గి పోతాయని భయపడి పోతున్నారని అసలు కారణం అదేనన్నారు.