ఏపీలో ఇప్పటికే అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకం అమలు చేయబోతోంది. రేపు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైయస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి సీఎం జగన్ ఈనెల 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీనే అమలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన ఇస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింప చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వర్తించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. జగనన్న వసతి దీవెనను 11,87,904 మంది విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. తొలి విడత విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.1,139.16 కోట్లను జమ చేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇప్పుడు 24వ తేదీన తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ ఆ పై చదువుతున్న 10,47,288 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు. 25వ తేదీ నుంచి జగనన్న విద్యా, వసతి దీవెన కార్డులను గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి అందజేయనున్నారు.
