ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్ఎజె) ఇచ్చిన పిలుపుమేరకు… ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోయారని, సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులపై పలుచోట్ల దాడులు జరిగాయని తెలిపారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ. ఢిల్లీ జరుగుతున్న అల్లర్లలో కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై దాడులు జరపడం దుర్మార్గమన్నారు. ఢిల్లీ దాడుల్లో గాయపడినవారికి నష్టపరిహారం ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.గడ్డన్న మాట్లాడుతూ. ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన దాడులను యావత్ లోకం ఖండించాలని పిలుపునిచ్చారు. కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయులపై మతం పేరుతో దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ఎజె రాష్ట్ర కార్యదర్శి శాంతి శ్రీ మాట్లాడుతూ ఇటీవల పాత్రికేయులపై దాడులు తీవ్ర తరమయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. ఢిల్లీ అల్లర్లలో కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయులపై మతోన్మాదులు దాడులు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వోద్యోగులకు భద్రత కల్పించినట్లు జర్నలిస్టులకు భద్రత కల్పించేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, సీనియర్ పాత్రికేయులు కె.గడ్డన్న, ఎన్ఎజె కార్యదర్శి శాంతిశ్రీ, సిటీ ప్రెసిడెంట్ కె.సాంబశివరావు, కోశాధికారి జెవి.శ్రీనివాసరావు, ఎపిడబ్ల్యుజెఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి వలీ, పాత్రికేయులు పాల్గన్నారు.
