రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వదంతుల పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈక్రమంలో కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ (కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దని, వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని, వైద్య సలహాలకోసం 104 టోల్ ఫ్రీ నంబరు కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలన్నారు. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని, ఇప్పటివరకూ 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉందన్నారు. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలింది. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కొవిడ్ 19 నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, ఇప్పటివరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదన్నారు. కొవిడ్19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామన్నారు. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. అలాగే అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామన్నారు. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
