అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామన్నారు.
కరోనాతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. అయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించిందని చెప్పారు. మనబడి, నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వాహన మిత్ర, చేయూత తదితర కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిపాలనను క్షేత్రస్థాయి వరకు చేరేలా సచివాలయ వ్యవస్థ పనిచేస్తోందని గవర్నర్ వివరించారు.
పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బిశ్వభూషణ్ చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూలస్తంభాలుగా భావిస్తున్నామన్నారు. ఉద్యోగుల వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని వివరించారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేపట్టామని.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించామని గవర్నర్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చే
స్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.