ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోమవారం కోపం వచ్చింది. ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసైన్మెంట్ కమిటీపై ఎమ్మెల్యేలు నిలదీయటంతో ఆయన అసహనానికి లోనయ్యారు.
రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా అని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్యే చైర్మన్గా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే అసైన్డ్ కమిటీల గురించి సమాచారం కోరారు.
ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ కమిటీలపై సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయో లేదా రిపోర్ట్ తెప్పించుకుంటామని ఆయన అన్నారు. అసైన్డ్ కమిటీలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేఈ అసహనం వ్యక్తం చేస్తూ.. తన చేతిలో ఉన్న పేపర్లను బల్లకేసి కొట్టారు.
సీఎందే బాధ్యత!
అనంతరం డిప్యూటీ సీఎం కేఈ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. అసైన్డ్ కమిటీల బాధ్యత సీఎందేనని అన్నారు. ‘ నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్తాను. ఎమ్మెల్యేలు నన్ను కాదు.. సీఎంను అడగాలి’ అని కేఈ అన్నారు.
జగన్ ఎఫెక్టా?
ప్రజా సంకల్పా యాత్ర లో బాగంగా కర్నూలులో జిల్లాలో జగన్ మాట్లాడుతూ.. కేఈని చూస్తుంటే జాలి కలుగుతోందని, పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని, కనీసం ఓ ఆర్డీవోను కూడా బదలీ చేయించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం తర్వాత స్థానంలో ఉండి కొడుమూరు-పత్తికొండ నియోజకవర్గాల మధ్య హంద్రీనీవా నదికి వంతెన నిర్మించలేకపోతున్నారన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం కేఈ అసెంబ్లీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.