సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్ ఇన్కంబర్డ్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే గాకుండా, వాలంటీర్లు ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై కూడా దృష్టిపెట్టాలని ఆదేశించారు. డబ్బు జమకాగానే ఈ రశీదులను లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని..ఈ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టంచేశారని సీఎం జగన్ అన్నారు.
