వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూపంలో గండం పొంచి ఉందా..? అందరిలోను ఇప్పుడు అదే అనుమానం మొదలైంది. తెలంగాణలో బహిష్కృత టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులతో ముద్రగడ భేటీ తరువాత ప్రతీ ఒక్కరిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్దరి భేటీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, త్వరలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి ఏపీలో పర్యటించాలని కూడా నిర్ణయమైంది. మోత్కుపల్లి పర్యటనలకు అవసరమైన సాయం చేస్తామని ముద్రగడ హామీ కూడా ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పాత శత్రువు ముద్రగడతో, కొత్త శత్రువు మోత్కుపల్లి నర్సింహం చేతులు కలిపారన్న విషయం అర్థమైపోతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎప్పటి నుంచో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చారు. అందులో కాపులను బీసీల్లో చేర్చడం కూడా ఉంది.
అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన సహజ లక్షణం ప్రకారమే హామీలన్నిటిని అటకెక్కించేశారు. సీఎం చంద్రబాబు హామీని నిలబెట్టే ఆలోచనలో లేరని గ్రహించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని మొదలు పెట్టారు. చివరకు ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎంతలా అంటే రైలు తగలబెట్టేంతలా అన్నమాట. ఇదిలా ఉండగా రైలు దహనం ఘటనకు సంబంధించి అనేక మంది కాపు నేతలపై సీఎం చంద్రబాబు కేసులు ఎట్టించారు. ఆ కేసులు ఇప్పటికీ వీగలేదు. ఆ తరువాత కాపుల కోసం యాత్రలు చేసేందుకు అనుమతి ఇవ్వమని ముద్రగడ పద్మనాభం అనుమతి అడిగినా.. అందుకు చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వలేదు. ఇలా ఏపీలోని అన్ని వర్గాల వారితోనూ చంద్రబాబు నాయుడు వైరం పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని ఎన్నికల గెలుపుకోసమేనని, ఆ హామీలను అమలు చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని గమనించిన వివిధ వర్గాల నేతలు అందరూ కలిసి చంద్రబాబుపై పోరాడేందుకు సిద్ధమయ్యారు.