ప్రస్తుతం కాలంతోపాటు పరిగెత్తే జీవితంలో నిద్ర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఇలా పడుకోగానే.. అలా నిద్రపోతారు. వాళ్లకు మాత్రమే అంతా అదృష్టం ఏంటబ్బా? అంటే వారి ఆలోచనలు ఎప్పడూ ఆశావహ దృక్పథంతో ఉండడమే అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఇల్లినియస్ ఎట్ అర్బన్ ఛాంపియన్ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒక పరిశోధన నిర్వహించారు.
అందులో ఆశావహ దృక్పథంతో ఆలోచనలు చేసేవారిలో 78 శాతం మంది నాణ్యమైన నిద్రను పొందుతున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో సుమారు 7 నుంచి 9 గంటలపాటు నిద్ర పోతునట్లుగా వెల్లడైంది. అలాగే నిరాశతో కూడిన ఆలోచనలు చేసేవారిలో 75 శాతం మంది సరైన నిద్రను పొందలేకపోతున్నారు. పగలు నిద్రకు అలవాటు పడుతున్నారు. ఈ పరిశోధనను 32 నుంచి 51 సంవత్సరాల మధ్య వయసు ఉండే మొత్తం 3500 మందిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనపై ప్రముఖ రచయిత డా.హర్నాండెజ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో ఉండే సమస్యలపైన ఎక్కువగా తమ ఆలోచనలు వృథా చెయ్యరు. తద్వారా వారు సుఖనిద్రను పొందగలరు అని పేర్కొన్నారు.