నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. టీడీపీకి 3వ స్థానమే అని తేల్చి చెప్పారు. తదనంతరం కాసేపటికే అసెంబ్లీలో హైబీపీతో కోటంరెడ్డి కుప్పకూలారు. అసెంబ్లీ డిస్పెన్సరీ వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్సనందించి..మెరుగైన వైద్యం కోసం…విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోటంరెడ్డిని పరీక్షించిన డాక్టర్లు…పెద్దగా ప్రాణాపాయం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. దీంతో కోటంరెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనైన తమ సహచర ఎమ్మెల్యే కోటం రెడ్డిని మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్లు కలిసి పరామార్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి త్వరగా కోలుకోవాలని, వారు ఆకాంక్షించారు.