టీడీపీ అధినేత చంద్రబాబుకు పోయేకాలం దగ్గరపడిందని…అందుకే ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని…ఇక పవన్ కల్యాణ్ గాజువాకలో ఓడిపోయారు కాబట్టే…ఉత్తరాంధ్రపై విద్వేషం చూపిస్తున్నారని చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ విరుచుకుపడ్డారు. తాజాగా మీడియాతో ధర్మశ్రీ మాట్లాడుతూ… అమరావతి పేరుతో భిక్షాటనలు చేస్తూ ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. బాబుకు పోయేకాలం దగ్గరపడిందని, జోలె పడితే జాలి వస్తుందని విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ముసుగులో టీడీపీ నేతలతో చంద్రబాబు ఉద్యమాన్ని నడిపిస్తున్నారంటూ ధర్మశ్రీ ధ్వజమెత్తారు. అసలు ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందుకంత కడుపు మంటని నిలదీశారు. గతంలో ఉత్తరాంధ్ర టీడీపీకి అండగా నిలవలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు. మీకు అమరావతిలో తప్పా… ఉత్తరాంధ్రలో బినామీ భూములు లేవని వైజాగ్లో రాజధానిని వ్యతిరేకిస్తున్నారా? అని బాబుకు చురకలు అంటించారు. ఇక రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని రాయలసీమ ప్రాంతాన్ని అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అమరావతికి మద్దతు పలుకుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ధర్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. గాజువాకలో ఓడిపోయాడు కాబట్టి ఉత్తరాంధ్రపై పవన్ విద్వేషం చూపిస్తున్నాడని ఆయన అన్నారు. . పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేర్వేరు కాదుని.. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. గొప్పల కోసం అప్పులు చేసి అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఇక వైజాగ్ రాజధాని అయితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ముంబైతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ధర్మ శ్రీ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉండటానికి కారణం చంద్రబాబే అని విమర్శించారు. ఇప్పుడు మరోసారి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న బాబును తెలివిలేని వాడిగా ప్రజలు భావిస్తున్నారని ధర్మశ్రీ అన్నారు. పరిపాలన అభివృద్ధి ద్వారా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని కరణం ధర్మశ్రీ చెప్పుకొచ్చారు. మొత్తంగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ల తీరును వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.