సుజనా చౌదరి..ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు…టీడీపీకి ప్రధాన ఆర్థికవనరు..గత ఎన్డీయే గవర్నమెంట్లో టీడీపీ రాజ్యసభసభ్యుడిగా, కేంద్రమంత్రిగా వెలిగిన సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రాగానే..సుజనా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ..ఎంపీగా కొనసాగారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలవడంతో చంద్రబాబు సుజనాతో పాటు మరో ముగ్గురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో విలీనం చేయించాడు. ఇక అప్పటి నుంచి సుజనా ద్వారా మళ్లీ మోదీకి దగ్గరయ్యేందుకు బాబు నానాతంటాలు పడుతున్నాడు. ఇక బిజేపీలో చేరినా సుజనా చౌదరిగారి మనసు చంద్రబాబు చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాషాయనేతగా కాకుండా పచ్చనేతగా పచ్చటి పలుకులు పలుకుతుంటారు. ఇప్పటికీ చంద్రబాబుపై ఈగవాలనివ్వడం లేదు
ఇక ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై మాజీ బాస్ చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతి పాట పాడుతున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి టీడీపీ నేతల కంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని అర అంగుళం కూడా కదలదని..కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని రాజధాని రైతులను మభ్యపెడుతున్నారు. అయితే బీజేపీ ఎంపీ, బిజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదని…రాజధాని ఎక్కడ అనే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టంగా చెబుతుంటే సుజనా మాత్రం కేంద్రం వికేంద్రీకరణను అడ్డుకుంటుందని..పదేపదే చెబుతున్నాడు. అయితే తాజాగా మూడు రాజధానుల అంశంలో సుజనా చౌదరి చెంప ఛెళ్లుమనిపించేలా జీవీఎల్ ఒక టీవీ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. సుజనా చౌదరికి పరోక్షంగా గడ్డి పెట్టారు. అంతే కాదు టీడీపీ విధానాల నుంచి బయటికొచ్చి….బీజేపీ పద్ధతులను పాటించాలని హితవు పలికారు. కాగా వారం క్రితం ఓ ఎల్లోమీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరి మాట్లాడుతూ…తన పార్టీ జాతీయ నేత జీవీఎల్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాజధాని విషయంలో జీవీఎల్ నరసింహారావు, మీ (సుజనా) మాటలకు మధ్య వ్యత్యాసం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెబుతున్నారని, మీరేమో అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని యాంకర్ సుజనా చౌదరిని ప్రశ్నించగా తాను అస్సలు జీవీఎల్ను పరిగణలోకి తీసుకోనని అవమానించేలా మాట్లాడాడు..జీవీఎల్కేమీ విశిష్ట అధికారాలు ఉంటాయని అనుకోనని ఘోరంగా తీసిపడేశాడు. అంతేకాదు, ఒక రాజ్యసభ సభ్యుడిగా తనకెన్ని అధికారాలు ఉంటాయో, జీవీఎల్కు కూడా అంతే ఉంటాయంటూ సుజనా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. అయినా జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు…కాకపోతే ఆయన ఆంధ్రావ్యక్తి మాత్రమే అని తక్కువ చేసి మాట్లాడాడు.
అయితే తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను కించపర్చిన సుజానాకు జీవీఎల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మండలి రద్దు , మూడు రాజధానుల ఏర్పాటులో మీరు చెబుతున్నంత స్పష్టంగా మీ పార్టీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని యాంకర్ ప్రశ్నించగా జీవీఎల్ స్పందిస్తూ…కొంత మంది మా పార్టీ ఎంపీలు విభజన చట్టంలో కొన్ని అంశాలున్నాయని, దాని ద్వారా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, కొన్ని డిబేట్స్లో చెప్పడం విన్నా. అలా చెప్పే వాళ్లలో కొందరు అధికార ప్రతినిధులు కాదు. కొంత మందికి కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల పట్ల అవగాహన లేదు అని ఘాటుగా సమాధానమిచ్చారు. అంటే కేంద్ర పార్టీ లైన్ కూడా తెలియదనుకోవాలా? అని యాంకర్ ప్రశ్నించగా జీవీఎల్ అంతే తీవ్ర స్వరంతో మాట్లాడుతూ.. ‘మరి అదే అనుకోవాలి. నేను చెప్పేదే కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వ లైన్… చాలా స్పష్టంగా చెబుతున్నా ఇది… కొంత మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు… వారికి ఇంకా పాత వాసనలు పోలేదేమో…అది కూడా కొంత ఆస్కారం ఉంది. తప్పనిసరిగా, పూర్తిగా బీజేపీ చెప్పే విధానాలనే వాళ్లు ఫాలో కావాలి’ అంటూ పరోక్షంగా సుజనా చౌదరికి గడ్డి పెట్టారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి ఇంకా పాత వాసనలు పోలేదని, బీజేపీ విధానాల ప్రకారమే నడుచుకోవాలని పరోక్షంగా చెబుతూ గట్టిగా హితవు పలికారు. మొత్తంగా మూడు రాజధానులు, శాసనమండలి రద్దు విషయంలో చంద్రబాబు పాట పాడుతున్న సుజనాచౌదరికి చెంప చెళ్లుమనేలా జీవిఎల్ కౌంటర్ ఇచ్చారంటూ.. ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది.