ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ తమ్మినేని సీతారామే ఇసుకను దొంగతనంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి బేసిగ్గా కాంట్రాక్టర్ అని.. ఇప్పుడాయన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడంతో దొంగ చేతికే తాళం దొరికినట్లయిందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఫ్యూచర్పై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాజాగా తిరుమల ఆలయానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి వెంకన్న దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబుకు బుద్ధి మందగించింది.. ఆలోచన తగ్గిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసేవన్నీ తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలే అని ధ్వజమెత్తారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో అసలు టీడీపీ అనే పార్టీ ఉండదని, చంద్రబాబువల్లే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే 30 ఏళ్లు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజల సంకల్పం కూడా అదేనని పెద్దిరెడ్డి చెప్పారు. ఇక చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రపై మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో జనం స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబుకు బుద్ధిరాలేదని, రాష్ట్రంలో లేనిపోని అలజడి సృష్టించడం కోసమే బస్సు యాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎలాగూ ఐటీ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల హవాలా స్కామ్లో జైలుకు పోకతప్పదని చంద్రబాబు భయపడుతున్నాడని…అందుకే ముందుగా ప్రజా చైతన్యయాత్రలో అరెస్ట్ అయి రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. బస్సు యాత్రలో అరెస్టు కావడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందొచ్చనే పిచ్చి ఆలోచనతోనే చంద్రబాబు పదేపదే సీఎం జగన్ను, మంత్రులను, నేతలను వ్యక్తిగతంగా తిడుతున్నారని..ఆఖరకు పోలీసులను కూడా రెచ్చగొడుతున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు మొత్తంగా చంద్రబాబు వల్లే వచ్చే ఐదేళ్లలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్టాపిక్గా మారాయి.