ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై రాజధాని రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మేం అధికారంలోకి వచ్చాక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఏపీకి రాజధాని నిర్మాణం పేరిట బెదిరించి.. భయాందోళనలకు గురిచేసి రైతుల నుంచి భూములు లాక్కున్న విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు విలువ చేసే భూముకు.. వేలల్లో లెక్కలు చూపి రైతులను నిలువెల్లా మోసం చేస్తూ చంద్రబాబు సర్కార్ పరిహారమంటూ చెల్లింపులు జరిపింది. ఆ విషయంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నోమార్లు అమరావతి రైతులలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సభలు, ర్యాలీలు నిర్వహించారు కూడాను.
అయితే, చంద్రబాబు సర్కార్ రాజధాని రైతులపై మళ్లీ కొరడా ఝులిపించింది. మూడేళ్ల క్రితమే భూములు ఇచ్చిన రైతులకు మే 1వ తేదీన కౌలు చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, జీవోల్లో పేర్కొన్న గడువు పూర్తవుతున్నా ఇప్పటి వరకు చంద్రబాబు సర్కార్ రైతులకు చెల్లించాల్సిన కౌలు మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబుకు భూములు అప్పచెప్పిన రైతులు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. చంద్రబాబు తమ వద్ద నుంచి కోట్ల విలువైన భూములను బెదిరింపులు చేసి మరీ లాక్కోవడమే కాకుండా.. కనీసం కౌలు మొత్తం చెల్లించకుండా తమకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.