పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజకీయ నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇద్దరూ తనకు ఇష్టమని చెప్పారు. నాడు రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు కూడా అంతకు మించిన రీతిలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి భౌతికంగా మన మధ్యన లేకపోయినా.. ఆయన జయంతి సందర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం వైఎస్ఆర్ను మరిచిపోకుండా ఆయన జయంతిని ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. వైఎస్ఆర్ లానే జగన్ కూడా మాట తప్పని, మడమతిప్పని యోధుడులా పాలన కొనసాగిస్తారని చెప్పారు సినీ నటుడు పృథ్వీరాజ్.