ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 కోట్ల విలువైన పనులను రద్దు చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. లోకేశ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అసెంబ్లీ ఎన్నికల ముందు పెండింగ్లో ఉన్న వాటితో కలిపి రూ.12,432 కోట్ల విలువైన పనులకు అనుమతులు మంజూరు చేసి, టెండర్లు పిలిచారు. రూ.3,635 కోట్లతో 2,442 చిన్నచిన్న రోడ్ల పనులకు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఎన్నికల ముందు టెండర్లు పిలవగా పనులను టీడీపీ నేతలే దక్కించుకున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. దీంతో పనులను రద్దు చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తుంది.
