ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ శాసన మండలి విప్, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి పాలనకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని విమర్శించారు. బాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ ఎన్నికలతో ముగిసిందని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పేద కుటుంబాలకు విద్యను అందించే దిశగా వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
