దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగించుకుంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. జనసేన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఎమ్మెల్యే పేకాట కేసులో ఇరుక్కుపోతే…ఆ కేసులో పవన్ కల్యాణ్ ఎంటరై ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో పోలీసులు కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అందులో కొంత మంది జనసేన కార్యకర్తలు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని విడిపించడానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూనుకున్నారు. అనుచరులను కాపాడుకోవడం వరకు ఓకే..కానీ…ఇలాంటి వ్యవహారాలను రాపాక సామరస్యంగా ముగించలేకపోయారు. స్థానిక ఎస్సై మాట తన వినలేదని అనుచరులతో కలిసి దండుగా బయల్దేరి పోలీసుస్టేషన్కు వెళ్లారు. స్టేషన్ పై దాడికేసులో ఇరుక్కుని అరెస్టయ్యారు. దీంతో జనసేన ఎమ్మెల్యేపై కేసు..మీడియాలో హైలైట్ అయిపోయింది…అయితే ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేస్త సరిపోయేది…నిదానంగా సద్దుమణిగేది.. కానీ ఈ ఇష్యూలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎంటరయ్యారు. పేకాట కేసును మళ్లీ తిరగదోడారు. ఓ కిడ్నీ వ్యాధిగ్రస్తుడిని పోలీసు స్టేషన్ కు తీసుకువెళితే… విడిపించడానికి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం సబబు కాదంటూ పవన్ ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. అంతే కాదు రాజోలుకు వచ్చి స్వయంగా ఉద్యమిస్తానని కూడా పవన్ అన్నారు. ఈలోగా రాపాకకు బెయిల్ రావడంతో.. అంత పనీ జరగలేదు. కానీ స్వచ్ఛ రాజకీయాలు చేస్తా అంటున్న జనసేనాని ఇలా పేకాట కేసులో జోక్యం చేసుకోవడం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు? ఇంతకు ఆయన ఎవరిని సమర్థిస్తున్నారా? పేకాట ఆడుతూ దొరికిపోయిన తమ పార్టీ నాయకుడినా? లేదా, అతని విడుదల కోసం వెళ్లి పోలీసు స్టేషన్ పై దాడిచేసి అద్దాలు పగులగొట్టించిన తన ఎమ్మెల్యేనా? అనేది జనసేనానికే తెలియాలి. ఆఫ్ట్రాల్ పేకాట వంటి కేసులకోసం, కిడ్నీ వ్యాధి లాంటి ముసుగు తొడిగి పోరాడితే జనసేనాని ప్రజల్లో అభాసుపాలవుతారు. ఇంత చిన్న విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు గ్రహించడంలేదో…అదే అర్థమైతే జనసేనాని ఎందుకు అవుతారు. మొత్తానికి పేకాట కేసులో జనసేనాని ఇరుక్కుపోయి..అభాసు పాలయ్యారు.
