నన్ను చంపుతామని, మంగళగిరి నుంచి తరమికొడతామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశారు. మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని ఫిర్యాదులో పొందుపరిచాను అంటూ పేర్కొన్నారు. ఇక వరద ముంపుకు గురైన చంద్రబాబు నివాసంలో వెళ్లినట్లు వచ్చిన వార్తలపై ఆర్కే స్పందించారు. కేవలం తన నియోజకవర్గంలో భాగం అయినందునే కరకట్ట ముంపు ప్రాంతాల్లో పర్యటించానని ఆర్కే తేల్చి చెప్పారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారని, తక్షణమే ఖాళీ చేస్తే మంచిదని ఆర్కే అన్నారు, అయితే తాను బాబు నివాసంలోకి మాత్రం వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో సహా, వైసీపీ ఎమ్మెల్యేలంతా పర్యటించినా కూడా టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారంటూ ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఇల్లు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. ప్రజాతీర్పు చూసి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఓర్వలేక పోతున్నారంటూ ఆర్కే ఎద్దేవా చేశారు. నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెరచాటు రాజకీయాలు మానుకోవాలని ఆర్కే హితవు పలికారు. మొత్తంగా ఆర్కేను చంపుతాం, మంగళగిరి నుంచి తరిమికొడతాం అంటూ సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు వచ్చిన దరిమిలా…ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఆర్కేపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.