జనసేనా అదినేత హీరో పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే భారీ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనతో , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలను ఎన్నడూ ప్రశ్నించని పవన్ ఇప్పుడు పనిగట్టుకొని జగన్ను విమర్శించడం వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి పవన్కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట తప్పితే, అదే ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 200 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నారన్న విషయం పవన్ మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ. 1.50 వేల కోట్లు అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, వంద రోజుల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం పవన్కు గుర్తులేదా అని మండిపడ్డారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడైనా మీకు చెప్పారా అంటూ పవన్ను సూటిగా ప్రశ్నించారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా అని, ధైర్యం ఉంటే నిజాయితీగా మాట్లాడాలని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.