ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైసీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది.
