జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులు ముఖ్య అతిధిగా హాజరు కమ్మని పవన్ను కోరగా..తనకు ఆరోగ్యం బాగాలేదంటూ..స్వయంగా పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. జనసేన విడుదల చేసిన ప్రెస్మీట్లో పవన్ చెప్పిన మాటలు యథాతథంగా..
మీడియా మిత్రులకు నమస్కారం..!
విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున, వ్యక్తిగతంగా నా తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల..నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచుగా నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ..సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. అయితే జనసేన తరపు నుంచి పార్టీ ప్రతినిధులు మీరు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని…ప్రెస్మీట్ విడుదల చేయడంతో పవన్కల్యాణ్ తీవ్రమైన వెన్నునొప్పితో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఆరోగ్యంపై జనసేన క్యాడర్తో పాటు, మెగాభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్కు వెన్నునొప్పి తిరగబెట్టడం మెగాఫ్యామిలీతో పాటు అభిమానులను కలవరపెడుతోంది.