ఏపీలో అన్ని దేవాలయాల్లో అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఏదైనా ఆలయంలో అర్చకులుగా చేరినవారి కుటుంబాలకు ఆ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వం చేసుకోవడానికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చిన సీఎ జగన్పై ఏపీలో అర్చకులతో సహా, బ్రాహ్మణ సామాజివర్గం, పీఠాధిపతులు, వివిధ స్వాములు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీరాజా ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి సీఎం జగన్ మాట నిలుపుకున్నారని లక్ష్మీపతి రాజా అన్నారు. ఈ నిర్ణయంతో ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అర్చకుల కుటుంబాల్లో వెలుగు నింపినట్లుయిందని లక్ష్మీరాజా పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ నేత లక్ష్మీపతి రాజా హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా అర్చకులకు వారసత్వ హక్కులు కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాడు వైయస్ హయాంలో ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య కైంకర్యాలకు నిధులు సమకూర్చడమే కాకుండా ఆలయాల్లో వేతన వ్యవస్థ నెలకొల్పి భక్తుల కానుకల మీద ఆధారపడి దుర్భరపరిస్థితులలో కాలం వెల్లదీస్తున్న అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ధార్మిక వాది వైయస్ఆర్ అయితే…నేడు అర్చకులకు వారసత్వ హక్కులు కల్పించి, కూల్చేసిన హిందూ దేవాలయాలను తిరిగి పునర్నిర్మిస్తున్న వైయస్ జగన్లు నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులు అని అర్చకులు ముక్తకంఠంతో అంటున్నారు.
