టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగాలలో 75 % చిత్తూరు జిల్లావాసులకే కేటాయించాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే..తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నుంచి టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు 75 శాతం స్థానిక చిత్తూరు జిల్లావాసులకు కేటాయించాలని బోర్డ్ సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమాన్ కరుణాకర్ రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీటీడీ పాలనమండలి.. ప్రభుత్వ అనుమతులకు పంపింది. టీటీడీ పంపిన తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇక నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో 75 శాతం చిత్తూరు జిల్లా వాసులకు దక్కే అవకాశం ఉంది. అయితే టీటీడీ నిర్ణయం పట్ల చిత్తూరు జిల్లావాసులు హర్షం వ్యక్త చేస్తున్నారు.
