గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్మీట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే టీడీపీ పార్టీ నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన వల్లభనేని వంశీ, చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ ను విమర్శించాను. వాళ్లకు ఇంకా ఆప్షన్ ఏముంది? చంద్రబాబునాయుడు ఇంకేమి చేయగలడు? పళ్లు పటపటా నూరతాడా? ముసలిపళ్లు ఊడిపోతాయి. ఇక్కడిదాకా సౌండొస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబునాయుడు? చంద్రబాబునాయుడు తోక కత్తిరింపులు, బెదిరింపులు, హూంకరింపులు, కాళ్లు పట్టుకోవడాలు ఎప్పుడో చూసేశాము. ఎలక్షన్ల ముందు మోదీ, అమిత్ షాను ఎన్ని తిట్టాడు? ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు?” అంటూ బాబును విమర్శించారు.
