టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లతో ఘోర పరాజయం పాలయినప్పుడే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేశారు. ఇక లోకేష్ను సీఎంను చేయడం కోసమే సమర్థుడైన జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి, కుటుంబానికి చంద్రబాబు దూరం చేశాడని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం. ఇదే విషయంపై వంశీ కుండబద్ధలు కొట్టారు. కాగా ఎన్టీఆర్ విషయంలో వంశీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది. ఒకవైపు తారక్ను నొప్పించకుండా మా వాడు అంటూనే.. మరోవైపు తారక్ మాకు అవసరం లేదంటూ..పార్టీ నేతలతో చెప్పిస్తోంది.
తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. తారక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు…. మా నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్..పార్టీకి ఆయన ఉంటే చాలని వర్ల రామయ్య హాట్ కామెంట్స్ చేశారు. 2009 ఎన్నికల తర్వాత తనను పక్కన పెట్టిన తీరుతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ టీడీపీకీ పూర్వవైభవం రావాలంటే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాల్సిందే. ఒకపక్క చంద్రబాబుకు వయసైపోయింది. ఇదివరకటి రాజకీయ చాణక్యం బాబులో కనిపించడం లేదు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఐదునెలలు కూడా కాకముందే సీఎం జగన్పై బాబు చేయిస్తున్న దుష్ప్రచారం ప్రజల్లో నెగెటివ్గా వెళుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని మళ్లీ గాడిన పెట్టడం బాబుకు కష్టమే. ఇక లోకేష్ నాయకత్వంపై టీడీపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి నమ్మకం లేదు. లోకేష్ కంటే ఎన్టీఆర్కు సినీ గ్లామర్తోపాటు, నాయకత్వ లక్షణాలు వందరెట్లు ఉన్నాయని వారు నమ్ముతున్నారు.
నిజానికి ఎన్టీఆర్ లాంటి మాస్ ఛరిష్మా ఉన్న నాయకుడు టీడీపీలో లేరు. ఇక ముందుకూడా రాబోరు. అందుకే ఎన్టీఆర్ను మళ్లీ పార్టీలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అవసరం లేదంటూ వర్లరామయ్య చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఎక్కడ తన కొడుకు లోకేష్ సీఎం కాకుండా అడ్డుకుంటాడో అని… చంద్రబాబు కావాలనే వర్ల రామయ్య లాంటి నేతలతో ఎన్టీఆర్ అవసరం లేదంటూ చెప్పిస్తున్నాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ల రామయ్య ప్రెస్మీట్ పెట్టి మరీ కోడెల తప్పు చేశాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వర్ల వ్యాఖ్యలతో పార్టీ కూడా తనపై బురదజల్లుతుందని తీవ్రమనస్తాపానికి గురైన కోడెల చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ను పార్టీలోకి రానివ్వకుండా తన వంధిమాగధులైన వర్ల రామయ్య లాంటి నేతలతో చెప్పిస్తున్నాడని చంద్రబాబుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే టీడీపీ నందమూరి, నారా వర్గాలుగా చీలిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.