ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో బాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని ఆయన తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములన్నీ చంద్రబాబు తన సామాజికవర్గానికే కట్టబెట్టారని రామచంద్రయ్య తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాల కంపు అని… ఆయన అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే నాడు మోదీని తిట్టి నేడు ఆయన కాళ్లు పట్టుకునేందుకు చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్లు బీజేపీని ఎందుకు విమర్శించరని రామచంద్రయ్య ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన మా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. మొత్తంగా చంద్రబాబు అమరావతి పర్యటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
