ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం బాబుగారికి షాక్ ఇస్తూ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని మరోసారి స్పష్టం చేశాడు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కావడంతో హర్షం వ్యక్తం చేశానని గంటా తెలిపారు. ఈ విషయంలో తమ పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నా.. విశాఖవాసిగానే సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నానని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ అని గంటా అన్నారు. జీఎన్ రావు కమిటీ సిఫారసులవల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖను పరిపాలనపరమైన రాజధానిని చేస్తే మరెంతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నగరమని తెలిపారు. రాజధానికి అన్ని విధాల అనువైన నగరం విశాఖ అని, పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో విశాఖలో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. అలాగే అదే సమయంలో అమరావతి రైతులకి తగిన న్యాయం చేయాలని గంటా సీఎం జగన్ను కోరారు. ఇదిలా ఉంటే ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో రైతులను మరింతగా రెచ్చగొడుతుంటే..మరో పక్క ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూడు రాజధానులపై ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక చంద్రబాబు డైలామాలో పడిపోయాడు. మొత్తంగా మూడు రాజధానులపై చంద్రబాబుకు గంటా షాక్ ఇస్తూ..సీఎం జగన్కు మద్దతు పలకడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
