ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాజధాని గ్రామాల రైతులతో గత నెలరోజులుగా ఆందోళనల కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనడం గమనార్హం. దీంతో చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణిలను రంగంలోకి దింపి రాజధాని రాజకీయంలో సెంటిమెంట్ పండిస్తున్నారు. అయితే ఏ రాజధాని ప్రాంతంలోని మహిళలతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నాడో..అదే రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
జనవరి 19 న రాజధాని ప్రాంతంలోని విజయవాడలో మహిళలు అధికార , పరిపాలనా వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు చేపట్టిన భారీ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మహిళలు నినదించారు. మూడు రాజధానులను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ భారీ ర్యాలీలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, పార్థసారథి, పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని అవినాశ్, గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ముఖ్యమంతి వైస్ జగన్ నిర్ణయాలను విజయవాడ ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో చంద్రబాబు అండ్ గ్యాంగ్ భూముల్ని కొట్టేశారని వెల్లంపల్లి ఆరోపించారు.
ఇక ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ..చంద్రబాబు రాజకీయ భిక్షగాడని వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో దుర్గా వారధిని కట్టని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. దయచేసి బాబు ట్రాప్లో పడొద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అమరావతిలో బాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమన్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలోనే ఉందని గుర్తు చేశారు. సుజనాచౌదరి వంటి బ్రోకర్ల మాటలు నమ్మొద్దని అన్నారు. మొత్తంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి మహిళలు ఉద్యమిస్తున్నారంటూ చంద్రబాబు, అనుకుల మీడియా చేస్తున్న ప్రచారాన్ని విజయవాడ మహిళలు తిప్పికొడుతూ..అధికార వికేంద్రీకరణకు మద్దతు పలకడం విశేషం. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం ద్వారా విజయవాడ మహిళలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.