ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇటీవల దాదాపు లక్షా 35 వేల గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. తాజాగా తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 552 టీచర్ పోస్టులకు గాను 400 మంది అర్హత సాధించారని తెలిపారు. మిగిలిపోయిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే త్వరలోనే టీచర్ల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 665 హాస్టల్స్ మూసివేసిందని, సీఎం జగన్ వాటిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఒకేసారి లక్ష 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని కొనియాడారు. ఉత్తీర్ణత సాధించడం కోసం కాపీయింగ్ను ప్రోత్సహించవద్దని కోరారు. కష్టపడి స్కూల్స్లో నాణ్యమైన విద్యను అందించడని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించండని మంత్రి పినిపె విశ్వరూప్ సూచించారు. కాగా ఎన్నికల మేనిఫెస్టోలోనే మెగా డీఎస్పీ నిర్వహిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు త్వరలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి విశ్వరూప్ తెలిపారు. అయితే గతంలో 7900 పోస్టులు భర్తీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పోస్టుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా టీచర్ల పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందనే వార్తతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.
